07 Aug 2026, Friday

అమరావతిలో 47 అంతస్తుల ట్విన్ టవర్స్‌కు కేబినెట్ ఆమోదం.. భారీ పెట్టుబడులకు కొత్త అడుగులు

By PRAJA NADU Desk 06 Aug 2026, 05:53 PM Updated: 06 Aug 2026, 09:31 PM 7 views
అమరావతి అభివృద్ధిలో భాగంగా 47 అంతస్తుల ట్విన్ టవర్స్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో APIIC భూ బదిలీలు, PPP పాలసీ-2026, అమరావతి ఐ ప్రాజెక్టు, హైస్పీడ్ రైలు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
అమరావతి అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా అమరావతిలో 47 అంతస్తుల ట్విన్ టవర్స్ నిర్మాణ ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ట్విన్ టవర్స్‌లో కార్పొరేట్ సంస్థలు, క్వాంటమ్ సంస్థలకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. రాజధానిలో అత్యాధునిక వాణిజ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో ఏదుల ముస్తూరులోని 19.55 ఎకరాల భూమిని APIICకు బదిలీ చేయడానికి, తిమ్మసముద్రంలోని 13.45 ఎకరాలను CUDAకు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల (UDA) పునర్వ్యవస్థీకరణకు కూడా మంత్రివర్గం అంగీకరించింది. అలాగే అమరావతి ‘ఐ’ ప్రాజెక్టు సవరించిన టెండర్లకు ఆమోదం, హైకోర్టు భవనం రీ-డిజైన్ ప్రతిపాదన, ఏపీ PPP పాలసీ-2026కు అనుమతి లభించాయి. PPP ప్రాజెక్టులకు రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మోతడకలో 2,344 ఎకరాల ల్యాండ్ పూలింగ్, హైస్పీడ్ రైలు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూముల సమీకరణ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోంది.

Related Stories