14 Aug 2026, Friday
రాజకీయాలు

రాజధాని నిర్మాణంలో మరో ముందడుగు సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి

By PRAJA NADU Desk 13 Aug 2026, 09:30 AM Updated: 13 Aug 2026, 08:59 PM 4 views
రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహదారిని ప్రారంభించనున్నారు. అనంతరం రాయపూడిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను జీఏడీకి అప్పగించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో భాగంగా నిర్మించిన రెండు స్టీల్ బ్రిడ్జిలను కూడా ప్రారంభిస్తారు. ఉండవల్లి నుంచి అమరావతికి నేరుగా కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
రాజధాని అమరావతి నిర్మాణాల్లో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రహదారిని ప్రారంభించనున్నారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా రాయపూడికి చేరుకుని అక్కడ నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను స్వీకరించి వాటిని సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నారు. ఒకే రోజు అమరావతి అభివృద్ధికి సంబంధించిన మూడు ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో పాటు, రహదారి అనుసంధానంలో భాగంగా నిర్మించిన రెండు స్టీల్ బ్రిడ్జిలను కూడా ప్రారంభించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో భాగంగా బకింగ్‌హామ్ కెనాల్‌పై 110 మీటర్ల పొడవుతో ఒక స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. అలాగే కొండవీటి వాగు, గుంటూరు చానల్‌పై 280 మీటర్ల పొడవుతో మరో స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో ఉండవల్లి నుంచి అమరావతికి నేరుగా ప్రయాణించే అవకాశం కలగనుంది. మంగళగిరి, విజయవాడ ప్రాంతాల నుంచి రాజధానికి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అమరావతి కనెక్టివిటీని మెరుగుపరిచే ప్రధాన ప్రాజెక్టుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు ఒకటిగా ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి నారాయణ బుధవారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జి వద్ద అమరావతికి స్వాగతం పలికేలా ఏ ఆకారంలో ప్రత్యేక పైలాన్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భవనాలు, మౌలిక వసతులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని ప్రాంత గ్రామాల్లో సందడి నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో అమరావతి రవాణా వ్యవస్థలో కొత్త అనుసంధానం ఏర్పడనుంది.

Related Stories