శ్రావణ మాస సందడి.. కనకదుర్గ ఆలయంలో భక్తుల రద్దీ, ప్రారంభమైన వరుణ యాగాలు
శ్రావణ మాసం ప్రారంభంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి నెలకొంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ నెల 21న వరలక్ష్మీ వ్రతం, 27 నుంచి 29 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. మరోవైపు లోకకల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ ఇంద్రకీలాద్రిపై త్రయాహ్నిక వరుణ యాగాలు, వరుణ జపాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస సందడి ప్రారంభమైంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
శ్రావణ మాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21వ తేదీన వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజున దుర్గమ్మ అమ్మవారు వరలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే ఆగస్టు 27, 28, 29 తేదీల్లో ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రావణ మాసం మొత్తం ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మరోవైపు విజయవాడలో లోకకల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగాలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై ఏపీ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు త్రయాహ్నిక వరుణ యాగాలు, వరుణ జపాలు నిర్వహిస్తున్నారు.
వేద పండితులు కృష్ణా నదిలోకి వెళ్లి ప్రత్యేక జపాలు చేశారు. ఆగస్టు 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు ఈ వైదిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. దుర్గాఘాట్, పాత యాగశాల వేదికలుగా ప్రత్యేక హోమాలు, జపాలు, ఘటాభిషేకాలు నిర్వహించనున్నారు.
శ్రావణ మాస ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఇంద్రకీలాద్రి ప్రాంతం భక్తి వాతావరణంతో కళకళలాడుతోంది.





