05 Sep 2026, Saturday
జాతీయం

పాతబస్తీ మెట్రోపై సీఎం స్పెషల్ ఫోకస్‌.. అనుమతులు రాగానే పనులు ప్రారంభం

By PRAJA NADU Desk 05 Sep 2026, 09:03 AM Updated: 05 Sep 2026, 01:43 PM 4 views
హైదరాబాద్‌ పాతబస్తీ మెట్రో కారిడార్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌కు అనుమతి ఇస్తే పనులను త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెండో దశలో ప్రతిపాదించిన ఏడు మెట్రో కారిడార్లలో ఓల్డ్‌సిటీ మార్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. మొత్తం 888 ఆస్తుల సేకరణలో ఇప్పటికే 833 ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 55 ఆస్తుల సేకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల నాటికి మెట్రో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.
హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతానికి మెట్రో రైలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. పాతబస్తీ మెట్రో కారిడార్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఓల్డ్‌సిటీ ప్రాంతానికి మెట్రో సేవలను వీలైనంత త్వరగా తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవల సైదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే సాధారణ ఎన్నికల సమయంలో మెట్రోలోనే ఓల్డ్‌సిటీకి వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతానని చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశాయి. 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ మెట్రో విస్తరణపై దృష్టి పెట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాలను మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు పలు కొత్త కారిడార్లను ప్రతిపాదించింది. ఇందులో ఓల్డ్‌సిటీ మెట్రో కారిడార్‌తో పాటు నాగోల్‌–శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మార్గం, ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌, రాయదుర్గం–కోకాపేట్‌ నియోపోలిస్‌, మియాపూర్‌–పటాన్‌చెరు, జేబీఎస్‌–మేడ్చల్‌, జేబీఎస్‌–శామీర్‌పేట్‌ మార్గాలను ప్రతిపాదించారు. రెండో దశ పార్ట్‌–ఏ కింద ఏడు కారిడార్లలో మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.38,595 కోట్ల అంచనా వ్యయాన్ని రూపొందించారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కీలకంగా మారింది. రెండో దశలోని ఏడు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లను 2024 నవంబర్‌ 4న కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించారు. మరోవైపు ప్రస్తుత మెట్రో ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా రూ.15 వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇందులో రూ.1,400 కోట్లను హెచ్‌ఎండీఏ ద్వారా చెల్లించి, మిగిలిన రూ.13,600 కోట్లను రుణంగా సమీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రుణసాయం విషయంలో సమస్యలు ఎదురవడంతో ప్రత్యామ్నాయంగా జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించేందుకు ఎస్‌బీఐ క్యాప్స్‌ను కన్సల్టెన్సీ సంస్థగా నియమించారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి కేంద్రం, రాష్ట్రం కలిసి నిధులు సమకూర్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. మొత్తం వ్యయంలో కేంద్రం వాటా 17 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 31 శాతం, బ్యాంకుల రుణాల వాటా 52 శాతంగా ప్రతిపాదించారు. కేంద్రం నుంచి నిధుల విడుదలలో ఆలస్యం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులతో పనులను ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పాతబస్తీ మెట్రోకు సంబంధించి భూసేకరణ, ఆస్తుల సేకరణ ప్రక్రియ కూడా కీలక దశకు చేరుకుంది. మొత్తం 888 ఆస్తులను సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 833 ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 55 ఆస్తుల సేకరణను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే ఓల్డ్‌సిటీ కారిడార్‌ పనులను ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాతబస్తీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. మెట్రో అందుబాటులోకి వస్తే నగరంలోని పాతబస్తీ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అందువల్ల కేంద్రం నుంచి అనుమతులు ఎప్పుడు వస్తాయి, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.

Related Stories