‘ఓటుకు నోటు’ కేసులో కీలక మలుపు.. పాత విచారణ రద్దు చేసిన సుప్రీంకోర్టు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జరిగిన విచారణను రద్దు చేసి, కేసును మొదటి నుంచి విచారించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో నమోదైన కేసు చట్టబద్ధతపై రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత విచారణలో భాగమైన న్యాయమూర్తి పదవీ విరమణ చేయడంతో తాజా ధర్మాసనం కొత్తగా విచారణ చేపట్టనుంది.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.
ఈ కేసు నమోదు విధానాన్ని సవాల్ చేస్తూ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం చెల్లదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. 2015లో నమోదైన కేసుకు అప్పటి చట్టాలే వర్తిస్తాయని, లంచం ఇవ్వడానికి కుట్ర చేశారనే ఆరోపణలు ఆ సమయంలో అమల్లో ఉన్న నిబంధనల పరిధిలోకి రావని వాదించారు.
అలాగే కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ సండ్ర వెంకట వీరయ్య కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది.
గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.
విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు మరింత సమయం అవసరమని కోరారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. గతంలో విచారణ చేపట్టిన ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి పదవీ విరమణ చేసినందున ఇప్పటివరకు జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు.
కేసును కొత్తగా విచారిస్తామని పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో పదకొండేళ్ల నాటి ఈ కేసులో మరోసారి న్యాయపరమైన ప్రక్రియ మొదలు కానుంది.





