బెంగళూరులో దారుణం.. అప్పు తీర్చలేదని మహిళను వివస్త్రను చేసి దాడి
కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళపై నలుగురు వ్యక్తులు తీవ్రంగా దాడి చేశారు. ఆమెను వివస్త్రను చేసి కొట్టడంతో పాటు ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. అప్పు చెల్లించకపోతే వీడియోను ఆన్లైన్లో పెడతామని బెదిరించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి నజ్రత్, సోహైల్, రేష్మ, సైఫ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో మహిళపై జరిగిన దాడి కలకలం రేపుతోంది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను కొందరు వ్యక్తులు తీవ్రంగా వేధించి, అమానుషంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వివస్త్రను చేసి కొట్టడంతో పాటు ఘటనను సెల్ఫోన్లో వీడియోగా చిత్రీకరించినట్లు వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన బాధితురాలు కొన్ని నెలల క్రితం రేష్మ అనే మహిళ వద్ద నుంచి రూ.50 వేల అప్పు తీసుకుంది. ప్రతినెలా రూ.5 వేల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుమారు నాలుగు వారాల పాటు ఆమె డబ్బు చెల్లించలేకపోయింది. రేష్మ నుంచి వేధింపులు ఎదురవుతాయనే భయంతో ఆమె ఫోన్ నంబర్ను బ్లాక్ చేసి, మరో ఇంటికి మారిపోయింది.
రెండు రోజుల క్రితం నజ్రత్ అనే మహిళ బాధితురాలికి ఫోన్ చేసి పని ఇప్పించడంతో పాటు కొంత డబ్బు కూడా ఇస్తానని చెప్పింది. దీంతో బాధితురాలు నజ్రత్ ఇంటికి వెళ్లింది. అక్కడ సొహైల్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నజ్రత్, సొహైల్, రేష్మ, సైఫ్ కలిసి బాధితురాలిని కుంబల్గోడులోని ఓ ఇంటికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
అక్కడ బాధితురాలిని వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించి, వెంటనే అప్పు చెల్లించకపోతే ఆ వీడియోను ఆన్లైన్లో పెడతామని బెదిరించినట్లు కేసులో పేర్కొన్నారు. దీంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురైంది.
ఈ ఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు





