బ్రిక్స్ సదస్సుతో ప్రపంచ వేదికపై భారత్ సత్తా చాటింది: సీఎం చంద్రబాబు
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు-18ను భారత్ విజయవంతంగా నిర్వహించడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సు ద్వారా ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు ఒకే వేదికపైకి వచ్చాయని పేర్కొన్నారు. న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆమోదాన్ని కూడా ఆయన స్వాగతించారు. బహుళపక్ష సంస్థల బలోపేతం, సరఫరా వ్యవస్థలు, ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి ప్రాధాన్యం ఇవ్వడం కీలకమని అన్నారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు-18పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు ఒకే వేదికపైకి రావడం ఈ సమావేశం ప్రత్యేకతగా సీఎం పేర్కొన్నారు. ప్రపంచం కీలక మార్పులను ఎదుర్కొంటున్న సమయంలో బ్రిక్స్ సదస్సు జరగడం మరింత ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు.
బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించడంపైనా చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. బహుళపక్ష సంస్థలను మరింత బలోపేతం చేయడం, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడం, ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అంశాలుగా వీటిని అభివర్ణించారు.
విభిన్న అభిప్రాయాలు కలిగిన దేశాలు ఒకే వేదికపైకి వచ్చి నిర్మాణాత్మకంగా చర్చించుకోవడం, ఏకాభిప్రాయానికి చేరుకోవడంలో భారత్ విశ్వసనీయ వేదికగా ఎదిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం భారత్ పెరుగుతున్న ఆర్థిక శక్తి, ప్రాధాన్యానికి నిదర్శనమని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కూడా సీఎం చంద్రబాబు ప్రశంసించారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్ గొంతు విశ్వాసం, గౌరవంతో వినిపిస్తోందని, సదస్సు విజయవంతంగా నిర్వహించడం ద్వారా అంతర్జాతీయంగా భారత్ స్థాయి మరింత పెరిగిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు





