ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్.. అనర్హుల ఖాతాల్లో రూ.10 వేల రిఫండ్
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపిక కాని దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చింది. అప్లికేషన్ సమయంలో చెల్లించిన రూ.10 వేల డిపాజిట్ మొత్తాన్ని తిరిగి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల పరిధిలో వచ్చిన 60,720 దరఖాస్తులను పరిశీలించగా సుమారు 40 వేల దరఖాస్తులు అనర్హమైనవిగా గుర్తించారు. ఎంపికైన లబ్ధిదారులకు మొబైల్ నంబర్ మార్పు చేసుకునే సౌకర్యాన్ని కూడా అధికారులు కల్పించారు.
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసి లబ్ధిదారుల జాబితాలో పేరు రాని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అప్లికేషన్ సమయంలో డిపాజిట్గా చెల్లించిన రూ.10 వేల మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు హౌసింగ్ బోర్డు చర్యలు చేపట్టింది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసే సమయంలో ప్రతి అభ్యర్థి నుంచి రూ.10 వేల చొప్పున ధరావతు మొత్తాన్ని అధికారులు స్వీకరించారు. అనంతరం దరఖాస్తులను రెవెన్యూ, రవాణా, జీహెచ్ఎంసీ తదితర శాఖల రికార్డులతో పరిశీలించారు. ఈ వెరిఫికేషన్లో అర్హత లేని దరఖాస్తులను గుర్తించారు.
హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 60,720 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సుమారు 40 వేల దరఖాస్తులను అధికారులు అనర్హమైనవిగా గుర్తించారు. దీంతో అర్హత పొందని వారికి వారు చెల్లించిన రూ.10 వేల డిపాజిట్ను తిరిగి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు కూడా అధికారులు కీలక సౌకర్యం కల్పించారు. దరఖాస్తు సమయంలో తప్పుగా నమోదైన మొబైల్ నంబర్లను సవరించుకునే అవకాశం ఇచ్చారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు నంబర్ లేదా ఆధార్ నంబర్ ఉపయోగించి వివరాలను మార్చుకోవచ్చు.
ఇక ఎంపికైన కుటుంబాలపై క్షేత్రస్థాయి సర్వే కొనసాగుతోంది. లబ్ధిదారుల అర్హతను పరిశీలించిన అనంతరం తుది జాబితాను సిద్ధం చేసి హౌసింగ్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.





