ఏపీలో చిరంజీవి కుమార్తె సుస్మితకు కీలక పదవి.. దుర్గ గుడి ట్రస్ట్ బోర్డులో నియామకం
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్లో కీలక బాధ్యతలు లభించాయి. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలు, ప్రత్యేక ఉత్సవాలకు సంబంధించిన చర్చల్లో సుస్మిత పాల్గొననున్నారు. సినీ రంగంలో స్టైలిస్ట్గా, నిర్మాతగా గుర్తింపు పొందిన ఆమెకు ఈ నియామకంపై మెగా అభిమానులు అభినందనలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మరో కీలక పదవి దక్కింది. చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 7, 2026న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సుస్మిత కొణిదెలను ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నామినేట్ చేశారు.
ఈ బాధ్యతల్లో భాగంగా ఇంద్రకీలాద్రి ఆలయంలో భక్తుల సౌకర్యాల మెరుగుదల, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాన ఉత్సవాలు, జాతరల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆమె చర్చల్లో పాల్గొంటారు. అవసరమైన సందర్భాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి, ట్రస్ట్ బోర్డుకు తన సలహాలు అందించనున్నారు.
సుస్మిత కొణిదెల సినీ రంగంలో ఫ్యాషన్ డిజైనర్గా, నిర్మాతగా కొనసాగుతున్నారు. తొలుత స్టైలిస్ట్గా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆమె అనంతరం నిర్మాతగా అడుగుపెట్టారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పలు చిత్రాలను నిర్మిస్తున్నారు.
ఇటీవల చిరంజీవి కుటుంబానికి చెందిన సుస్మితకు ఈ కీలక బాధ్యత రావడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.





