రీల్స్కు బానిసై ఇంటర్నెట్ సమస్యతో మహిళ ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మొబైల్లో రీల్స్ చూడటానికి అలవాటు పడిన ఓ మహిళ ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడింది. కోర్బా జిల్లా కేరాకచ్చర్ గ్రామానికి చెందిన మంగ్లో బాయ్ సారధి అనే మహిళ ఈ ఘటనలో మృతి చెందింది. రీల్స్ చూస్తున్న సమయంలో నెట్ సమస్య రావడంతో అసహనానికి గురైన ఆమె పురుగుల మందు తాగింది. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది.
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్గఢ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మొబైల్లో రీల్స్ చూడటానికి బానిసైన ఓ మహిళ ఇంటర్నెట్ సమస్య కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్బా జిల్లా కేరాకచ్చర్ గ్రామానికి చెందిన మంగ్లో బాయ్ సారధి అనే మహిళ ప్రతిరోజూ గంటల తరబడి మొబైల్లో రీల్స్ చూస్తూ గడిపేది. శనివారం రీల్స్ చూస్తున్న సమయంలో మొబైల్లో ఇంటర్నెట్ సమస్య తలెత్తింది. వీడియోలు ఎక్కువ సేపు బఫర్ కావడంతో ఆమె తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.
దీంతో కోపంతో తన మొబైల్ ఫోన్ను విసిరి కొట్టిన సారధి అనంతరం పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె కుమార్తె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే ఆమెను కర్తాలా ప్రైమరీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కోర్బా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సారధి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.





