సెలవు కోసం క్లాస్మేట్ను చంపేందుకు యత్నం.. అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఘటన
అన్నమయ్య జిల్లాలోని గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్కు సెలవు వస్తుందనే ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థులు తమ క్లాస్మేట్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. గతంలో ఓ విద్యార్థి మృతి చెందడంతో పాఠశాలకు సెలవు ఇచ్చిన విషయం గుర్తు చేసుకుని ఈ దారుణ ఆలోచనకు పాల్పడ్డారు. నిద్రిస్తున్న విద్యార్థి ముఖంపై దిండుతో నొక్కి గొంతు నులిమేందుకు ప్రయత్నించగా బాధితుడు తప్పించుకుని సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. విచారణలో నిజం బయటపడింది.
అన్నమయ్య జిల్లా: సెలవు కోసం ఇద్దరు విద్యార్థులు చేసిన దారుణ ప్రయత్నం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు తమ క్లాస్మేట్ను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గురుకుల పాఠశాల వసతి గృహంలో ఉంటున్న ఇద్దరు విద్యార్థులకు సెలవు కావాలని అనిపించింది. రెండేళ్ల క్రితం ఇదే పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందగా, ఆ సమయంలో స్కూల్కు సెలవు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. అదే విధంగా తోటి విద్యార్థిని చంపితే పాఠశాలకు సెలవు వస్తుందని భావించి ఈ దారుణానికి పాల్పడ్డారు.
అర్ధరాత్రి సమయంలో గదిలో నిద్రిస్తున్న మరో విద్యార్థి ముఖంపై దిండుతో నొక్కి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారు. అయితే బాధిత విద్యార్థి వారి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ సమాచారం ఎంఈవో రెడ్డి బాషా వరకు చేరింది. ఆయన హాస్టల్కు వెళ్లి విద్యార్థులను విచారించారు. తల్లిదండ్రుల సమక్షంలో ఇద్దరు విద్యార్థులు తాము చేసిన ప్రయత్నాన్ని అంగీకరించారు.
విచారణ అనంతరం ఇద్దరు విద్యార్థులకు టీసీలు ఇచ్చి పాఠశాల నుంచి పంపించినట్లు ఎంఈవో తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు.





