అమెరికా డీల్ మాకే అనుకూలం.. ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు
స్విట్జర్లాండ్లో జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చల మధ్య ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. అమెరికాతో కుదిరిన అవగాహన తమ దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉందన్నారు. అణ్వాయుధాల అభివృద్ధి తమ లక్ష్యం కాదని స్పష్టం చేస్తూ, ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుత అవసరాల కోసమేనని పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. స్విట్జర్లాండ్లో కొనసాగుతున్న చర్చలపై స్పందించిన ఆయన, అమెరికాతో కుదిరిన డీల్లోని అంశాలు ఇరాన్కు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
ఖతార్లో నిల్వ ఉంచిన 6 బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులు త్వరలో దేశానికి చేరుతాయని పెజెష్కియాన్ తెలిపారు. చర్చల ఫలితాలు, తమ దేశం సాధించిన విజయాలు త్వరలో ప్రపంచానికి తెలుస్తాయని పేర్కొన్నారు. గతంలో ఆంక్షల సమయంలో వివాదాస్పదంగా మారిన పలు అంశాలు ఇరాన్ ప్రజల హక్కులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంగీకరించారని ఆయన చెప్పారు.
అణు కార్యక్రమంపై కూడా ఇరాన్ అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారు. ఇరాన్కు అణుబాంబు ఉండకూడదని అమెరికా షరతు విధించినప్పటికీ, తమ దేశం కూడా అణ్వాయుధాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోలేదన్నారు. తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని మరోసారి పునరుద్ఘాటించారు.
ఈ డీల్ అమల్లోకి వస్తే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు నిరాశ తప్పదని కూడా వ్యాఖ్యానించారు. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకడం, ప్రాంతీయ శాంతి స్థాపన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో 60 రోజులపాటు సుదీర్ఘ చర్చలు నిర్వహించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఆ చర్చలు ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొనసాగుతున్నాయి.





