తెలంగాణలో భారీ వర్షాల బీభత్సం.. ఒకరు మృతి, మరొకరు గల్లంతు
తెలంగాణవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి, రహదారులు దెబ్బతిని పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా బల్లివాగులో మర్సుకోల పారుబాయి వరదలో కొట్టుకుపోయి మృతి చెందగా, ములుగు జిల్లా జంపన్నవాగులో పీట్ల తిమ్మయ్య గల్లంతయ్యాడు. ఇసుకవాగు ఉప్పొంగడంతో జాతీయ రహదారి–163పైకి నీరు చేరింది. బొగత జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేశారు. రాష్ట్రంలోని 587 మండలాల్లో వర్షం నమోదవగా, పలిమెల, సారంగాపూర్లలో 19.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం కురిసింది. జులై 30న అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపిలేని వానల ధాటికి పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగగా, చెరువులు తెగిపోయి, రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల పంటలు నీటమునిగాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా బల్లివాగు దాటుతూ ఒక గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోగా, ములుగు జిల్లా మేడారం వనదేవతల దర్శనానికి వచ్చి, జంపన్నవాగులో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు ఉప్పొంగడంతో జాతీయ రహదారి 163పైకి నీరు చేరింది. చీకుపల్లి వద్ద ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత జలపాతం వరదనీటితో ఉరకలేస్తోంది. దీంతో జలపాతం సందర్శనను నిలిపివేశారు. నిర్మల్ జిల్లా సోన్-ధర్మారం మధ్య ప్రధాన రహదారి వరద నీటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు విఘాతం కలగగా, పెంబి మండలంలో కడెం వాగు పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం నాటికి 30 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వర్షాల ధాటికి పలు జిల్లాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. తెలంగాణలో 621 మండలాలుంటే ఏకంగా 587 చోట్ల మంగళవారం వర్షం పడింది. 30 మండలాల్లో అయితే ఏకంగా 10-20 సెంటీమీటర్ల మధ్య భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఆ జిల్లాల్లో 20-40 సెంటీమీటర్ల మధ్య కుండపోత కురిసే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ నిపుణులు బాలాజీ వెల్లడించారు.
వర్షపాతం వివరాలు.
జయశంకర్- పలిమెల- 19.4
జగిత్యాల-సారంగాపూర్-19.4
జగిత్యాల-బుగ్గారం-18.3
జగిత్యాల-వెల్గటూరు-17.5
జగిత్యాల-ఎండపల్లి-15.3





