13 Sep 2026, Sunday
జాతీయం

‘బ్రిక్స్’ ప్రత్యేక విందుపై రాహుల్ చురకలు.. సోషల్ మీడియాలో వైరల్

By PRAJA NADU Desk 13 Sep 2026, 04:00 PM Updated: 13 Sep 2026, 05:28 PM 1 views
ఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన గాలా విందులో పూర్తిగా శాకాహార మెనూ వడ్డించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. భారతీయ నాన్‌వెజ్ వంటకాలకు కూడా అంతర్జాతీయ వేదికపై చోటు ఉండాల్సిందని ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక గాలా విందు రాజకీయ చర్చకు దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన ఈ విందులో విదేశీ దేశాధినేతలు, ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా భారతీయ వంటకాలతో కూడిన మెనూను సిద్ధం చేశారు. అయితే ఈ విందులో పూర్తిగా శాకాహార వంటకాలను మాత్రమే వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శనివారం రాత్రి ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ విదేశీ నేతలు, ప్రతినిధుల కోసం గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు. భారతీయ ప్రాంతీయ ఆహార సంస్కృతిలోని వైవిధ్యాన్ని అంతర్జాతీయ అతిథులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రత్యేక శాకాహార మెనూను రూపొందించారు. ఇందులో ఖాండ్వీ మిల్లే-ఫెయ్, ఖుంబ్ గలౌటీ వంటి వంటకాలను ప్రారంభ వంటకాలుగా అందించారు. సంప్రదాయ భారతీయ వంటకాలకు ఆధునిక రూపాన్ని ఇచ్చి అతిథులకు వడ్డించడం ఈ మెనూలో ప్రత్యేకతగా నిలిచింది. ప్రధాన వంటకాలలో పన్నీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్, క్యారెట్ బీన్ పొరియల్, థక్కాళి బెల్లె సారు వంటి వంటకాలు ఉన్నాయి. వీటితో పాటు మిల్లెట్ పులావ్, బీట్‌రూట్ రాయితా, వివిధ రకాల భారతీయ రొట్టెలను కూడా వడ్డించారు. మెనూలో చిరుధాన్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. పులావ్‌లో సజ్జలు, రొట్టెల్లో జొన్నలు, డెజర్ట్‌లో కొర్ర వంటి చిరుధాన్యాలను ఉపయోగించినట్లు సమాచారం. భోజనం చివర్లో ఓల్డ్ ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్‌తో జిలేబీ, షాహ్తూత్ ఫిర్నీ వంటి భారతీయ మిఠాయిలను అందించారు. మల్బెర్రీ పండ్లతో అలంకరించిన ఫిర్నీకి ఆధునిక రూపాన్ని తీసుకొచ్చారు. పోషకాహారం, స్థిరమైన వ్యవసాయం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటేలా మెనూను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విందులో నాన్‌వెజ్ వంటకాలు లేకపోవడంపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మాంసాహారం తీసుకుంటారని ప్రస్తావిస్తూ.. భారతీయ నాన్‌వెజ్ వంటకాలకు కూడా అంతర్జాతీయ వేదికపై చోటు కల్పించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలో సరదా టచ్ ఇస్తూ చోలే భటూరేను కూడా ప్రస్తావించారు. ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. రాహుల్ వ్యాఖ్యలపై అధికారపక్షం నుంచి కూడా స్పందన వచ్చింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విందు మెనూను రాజకీయ అంశంగా మార్చడం సరికాదని విమర్శించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, సాంకేతికత, ఆరోగ్యం, గ్లోబల్ సౌత్ వంటి కీలక అంశాలపై చర్చించాల్సిన బ్రిక్స్ సదస్సులో అనూహ్యంగా ‘వెజ్ వర్సెస్ నాన్‌వెజ్’ అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Related Stories