పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా.. దేశాభివృద్ధి ఎలా సాధ్యం: అభిజీత్ దీప్కే
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే కేంద్రాన్ని కోరారు. పాఠశాలల భవనాలు, ఉపాధ్యాయ పోస్టులు, నిధులు, కంప్యూటర్లు, డిజిటల్ లెర్నింగ్, టాయిలెట్లు, క్రీడా సౌకర్యాలపై వివరాలు వెల్లడించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు. గత ఐదేళ్లలో పాఠశాలల అభివృద్ధికి కేటాయించిన నిధులు, వాటి వినియోగంపై కూడా సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేకపోతే దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. ప్రజా విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచాలని ఆయన కోరారు. ఈ అంశంపై సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అభిజీత్ దీప్కే కోరారు. గత ఐదేళ్లలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించారో, ప్రస్తుతం ఎన్ని పాఠశాలలకు మరమ్మతులు లేదా పూర్తిస్థాయి పునర్నిర్మాణం అవసరమో వెల్లడించాలని కోరారు.
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై కూడా వివరాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయి, వాటిలో ఎన్ని భర్తీ అయ్యాయి, ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయో స్పష్టం చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై బోధనతో పాటు ఇతర ఏ విధమైన విధులు, బాధ్యతలు అప్పగిస్తున్నారో కూడా వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు.
పాఠశాలలకు కేటాయిస్తున్న నిధుల వినియోగంపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు, అందులో ఎంత ఖర్చు చేశారు అనే వివరాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు భవిష్యత్తులో ఇంకా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు అవసరమవుతాయో కూడా వివరించాలని అన్నారు.
పాఠశాలల్లో విద్యా ప్రమాణాలతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కీలకమని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు, డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు, శుభ్రమైన టాయిలెట్లు, క్రీడా మైదానాలు, అవసరమైన క్రీడా పరికరాలు అందుబాటులో ఉన్నాయో వివరించాలని కోరారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే పాఠశాల భవనాలు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల సంఖ్య, డిజిటల్ సౌకర్యాలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను రాసిన లేఖ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, విద్యార్థుల భవిష్యత్తు గురించి ప్రశ్నలు లేవనెత్తేందుకేనని కేంద్ర విద్యాశాఖ మంత్రికి అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.





