సీఎన్జీ ధరలకు మళ్లీ రెక్కలు.. కిలోకు రూ.3.89 పెంపు
ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో సీఎన్జీ ధరలు మరోసారి పెరిగాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి కిలో సీఎన్జీపై రూ.3.89 పెంచుతున్నట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ప్రకటించింది. దీంతో ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.86.98కి చేరింది. నోయిడా, ఘాజియాబాద్లో రూ.95.59, గురుగ్రామ్లో రూ.92.01గా ఉంది. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ ధరలు పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తాజా పెంపునకు కారణమని IGL తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో సీఎన్జీ ధరలు మరోసారి పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) శనివారం ఉదయం 6 గంటల నుంచి కిలో సీఎన్జీపై రూ.3.89 చొప్పున ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.86.98కి చేరుకుంది.
పరిసర ప్రాంతాల్లోనూ ధరలు పెరిగాయి. నోయిడా, ఘాజియాబాద్లో కిలో సీఎన్జీ ధర రూ.95.59గా ఉండగా, గురుగ్రామ్లో రూ.92.01కి చేరింది. మీరట్, ముజఫర్నగర్, షామ్లీలో కిలో ధర రూ.95.47గా ఉంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ఎల్ఎన్జీ ధరలు భారీగా పెరగడం వల్ల సీఎన్జీ సరఫరా వ్యయం పెరిగిందని IGL తెలిపింది. హోర్ముజ్ జలసంధి మీదుగా ఎల్ఎన్జీ కార్గో రవాణాకు అంతరాయం ఏర్పడటం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని పేర్కొంది. అంతర్జాతీయ ఎల్ఎన్జీ ధరలు సంక్షోభానికి ముందు స్థాయితో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయని తెలిపింది.
తాజా పెంపుతో సీఎన్జీ వాహనదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ముఖ్యంగా ప్రైవేటు కార్లు, ట్యాక్సీలు, ఆటోలు, ఇతర వాణిజ్య వాహనాల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ అదనపు భారం చివరకు ప్రయాణికులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.





