డ్రగ్స్ రవాణా కేసులో మాజీ ఎయిర్ హోస్టెస్ అరెస్ట్
డ్రగ్స్ రవాణా కేసులో మాజీ ఎయిర్ హోస్టెస్ మాన్సీ సయ్యద్ అరెస్టయ్యారు. వడోదర నుంచి ముంబైకి కారులో డ్రగ్స్ తరలిస్తున్న సమయంలో సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో రూ.30 లక్షల విలువైన 977 గ్రాముల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. మాన్సీతో పాటు సోహైల్ సులేమాన్ షేక్ను కూడా అరెస్టు చేశారు. మాన్సీ గతంలో మలేషియన్ ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. 2021లో ఇండోర్లో డ్రగ్స్ కేసులో ఆమె అరెస్టైనట్లు వెల్లడించారు.
న్యూఢిల్లీ: డ్రగ్స్ రవాణా కేసులో మాజీ ఎయిర్ హోస్టెస్ మాన్సీ సయ్యద్ (41) అరెస్టు కావడం కలకలం రేపుతోంది. వడోదర నుంచి ముంబైకి కారులో భారీగా మత్తుపదార్థాలను తరలిస్తున్నట్లు సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై నిఘా ఏర్పాటు చేసి, టోల్ ప్లాజా సమీపంలో మాన్సీ ప్రయాణిస్తున్న కారును గుర్తించి ఆపారు.
కారును తనిఖీ చేయగా రూ.30 లక్షల విలువైన 977 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్ బయటపడినట్లు పోలీసులు తెలిపారు. మత్తుపదార్థాలతో పాటు మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ ప్యాకింగ్కు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు, కంటైనర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మాన్సీతో పాటు ఆమె సహాయకుడిగా పేర్కొన్న సోహైల్ సులేమాన్ షేక్ (20)ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైలోని శాంతాక్రూజ్కు చెందిన మాన్సీ గతంలో మలేషియన్ ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేశారు. ఉద్యోగరీత్యా ఆమె పలు దేశాలకు ప్రయాణించినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగం మానేసిన తర్వాత డ్రగ్స్ సరఫరా నెట్వర్క్తో ఆమెకు సంబంధాలు ఏర్పడినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు. 2015 నుంచే ఈ నెట్వర్క్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, మాన్సీ గతంలోనూ డ్రగ్స్ కేసులో అరెస్టయినట్లు పోలీసులు వెల్లడించారు. 2021లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సుమారు 100 గ్రాముల డ్రగ్స్తో ఆమె పట్టుబడినట్లు తెలిపారు. ఆ కేసులో దాదాపు నాలుగేళ్లు జైలులో గడిపినట్లు పేర్కొన్నారు. అప్పటి దర్యాప్తులో మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉన్న డ్రగ్స్ సరఫరా నెట్వర్క్తో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం తాజా కేసులో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, మాన్సీతో పాటు పట్టుబడిన వ్యక్తి పాత్ర, అలాగే గతంలో ఉన్న డ్రగ్స్ నెట్వర్క్ సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.





