సీషెల్స్లో మోదీ కీలక చర్చలు.. ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి
సీషెల్స్లో మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రతినిధి స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. స్టేట్ హౌస్లో జరిగిన ఈ చర్చల్లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తదితరులు పాల్గొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, సముద్ర సహకారం, అభివృద్ధి భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు. అంతకుముందు ప్రధాని మోదీకి స్టేట్ హౌస్లో గౌరవ వందనం నిర్వహించారు. సీషెల్స్ స్వాతంత్ర్యానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగే జాతీయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రతినిధి స్థాయి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. స్టేట్ హౌస్లో జరిగిన సమావేశంలో భారత్, సీషెల్స్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాలు చర్చించాయి.
భారత ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రత, ప్రాంతీయ సహకారం, అభివృద్ధి భాగస్వామ్యం, వ్యూహాత్మక సంబంధాల విస్తరణపై సమావేశంలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సమావేశానికి ముందు ప్రధాని మోదీకి స్టేట్ హౌస్లో అధికారిక గౌరవ వందనం నిర్వహించారు. శనివారం విక్టోరియాకు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు హెర్మినీ, మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ నృత్య ప్రదర్శన కూడా నిర్వహించారు.
పర్యటనలో భాగంగా మోదీ సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్ను సందర్శించారు. భారత్ నిర్మించిన ఫాస్ట్ పట్రోల్ వెసెల్ PS LESPWAR, ఆరు అంబులెన్స్లు, పది యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ గైడెడ్ బోట్లు సీషెల్స్కు అందజేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర నిఘా, ప్రత్యేక ఆర్థిక మండలి భద్రతను బలోపేతం చేయడంలో ఇవి ఉపయోగపడనున్నాయి.
సీషెల్స్ స్వాతంత్ర్యానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం నిర్వహించే గోల్డెన్ జూబ్లీ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత్-సీషెల్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ పర్యటన మరింత ఊతమిస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది.





