పవన్ ఆరోగ్యంపై బండ్ల గణేశ్ భావోద్వేగం.. 15 ఏళ్ల బాధను గుర్తుచేసిన నిర్మాత
పవన్ కల్యాణ్కు భుజం గాయంపై వైద్యులు శస్త్రచికిత్స సూచించిన నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేశ్ భావోద్వేగ పోస్టు చేశారు. గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో గుజరాత్లో జరిగిన ప్రమాదం తర్వాత కూడా నిర్మాతకు ఇబ్బంది కలగకూడదని ఆపరేషన్ను వాయిదా వేసి సినిమా పూర్తి చేసిన పవన్ త్యాగాన్ని గుర్తుచేశారు. పదిహేనేళ్లుగా నొప్పిని భరిస్తూ పనిచేసిన ఆయనకు ఇకపై ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కల్యాణ్కు భుజం గాయంపై వైద్యులు శస్త్రచికిత్స సూచించిన విషయం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో రొటేటర్ కఫ్తో పాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేశ్ సోషల్మీడియాలో చేసిన పోస్టు వైరల్గా మారింది. పదిహేనేళ్లుగా పవన్ కల్యాణ్ నడుము, భుజం నొప్పితో ఎంత బాధ అనుభవించారో ఇప్పుడు తెలిసి తన మనసు బరువెక్కిందని ఆయన పేర్కొన్నారు.
గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్న బండ్ల గణేశ్.. గుజరాత్లో గుర్రంపై నుంచి పడిపోవడంతో పవన్కు తీవ్ర గాయం అయినప్పటికీ, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పినా నిర్మాతకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో చికిత్సను వాయిదా వేసి ముందుగా సినిమా పూర్తి చేశారని వెల్లడించారు.
"ముందు సినిమా పూర్తి చేద్దాం. నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు. వందల మంది కష్టపడుతున్నారు" అని చెప్పి షూటింగ్ను కొనసాగించిన పవన్ నిర్ణయం తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనిదని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. ఒక నిర్మాతగా తనకు హిట్ సినిమా మాత్రమే కాకుండా జీవితాంతం తీర్చలేని రుణాన్ని ఇచ్చారని అన్నారు.
ఇప్పుడైనా పవన్ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ప్రశాంతమైన జీవితం గడపాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన తన పోస్టులో రాశారు. తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఎంతో మందికి అండగా నిలిచిన నిజమైన హీరో పవన్ కల్యాణ్ అని కొనియాడారు.





