అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారనుంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. వర్షాల ప్రభావంతో నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
అమరావతి, సెప్టెంబర్ 11: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. రానున్న మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్షాల ప్రభావంతో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు వాతావరణ హెచ్చరికలను నిరంతరం చేరవేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సముద్రంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ 112, 1070, 1800 425 0101 కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచింది.





