బిట్టు ఓ హీరో.. అతడికి అంతర్జాతీయ గుర్తింపు రావాలి: కెవిన్ పీటర్సన్
మధ్యప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి బిట్టు తబాహీ పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన సేవలను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసించారు. బియోరాలోని అజ్నార్ నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, నాచు, బురద, పూజా సామగ్రి వ్యర్థాలను బిట్టు స్వయంగా నదిలోకి దిగి తొలగించాడు. సుమారు రూ.30 వేల సొంత డబ్బుతో పనిముట్లు, చెత్త బుట్టలు కొనుగోలు చేశాడు. అతడి సేవలను హీరోయిజంగా అభివర్ణించిన పీటర్సన్.. బిట్టుకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.
మధ్యప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి బిట్టు తబాహీ పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన సేవలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అతడి నిబద్ధతను చూసి ఇంగ్లండ్ మాజీ క్రికెట్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించారు. బిట్టు కాలుష్యంపై స్వయంగా పోరాడుతున్నాడని, అతడు నిజమైన హీరో అని పీటర్సన్ పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని బియోరాలో ఓ ఆలయం సమీపంలోని అజ్నార్ నది తీవ్రంగా కలుషితమై ఉండటాన్ని బిట్టు గమనించాడు. నదిలో ప్లాస్టిక్, నాచు, బురదతో పాటు పూజా సామగ్రి వ్యర్థాలు భారీగా పేరుకుపోయి దుర్వాసన వస్తుండటంతో అధికారుల కోసం ఎదురుచూడకుండా తానే రంగంలోకి దిగాడు. నదిలోకి దిగి వ్యర్థాలను తొలగించడం ప్రారంభించాడు.
బిట్టుకు ఈత కూడా రాదని, అయినప్పటికీ నదిని శుభ్రం చేసే పనిలో వెనుకడుగు వేయలేదని పీటర్సన్ తెలిపారు. గ్లౌజులు, బూట్లు వంటి రక్షణ పరికరాలు లేకుండానే అతడు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. తన స్నేహితులతో కలిసి డబ్బులు సమకూర్చుకుని పనిముట్లు, చెత్త బుట్టలు కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.30 వేల సొంత డబ్బును ఖర్చు చేశాడు. ఈ క్రమంలో అతడి చేతులకు ఇన్ఫెక్షన్లు వచ్చినప్పటికీ సేవా కార్యక్రమాన్ని ఆపలేదు.
బిట్టు ఇంటిపేరు ‘తబాహీ’ అంటే విధ్వంసం అని అర్థమని పీటర్సన్ ప్రస్తావించారు. అయితే బిట్టు మాత్రం ఇప్పుడు కాలుష్యంపై పోరాటం చేస్తున్నాడని అన్నారు. మార్పు కోసం ఇతరుల కోసం ఎదురుచూడకుండా మనమే ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు. బిట్టు చేసిన సేవలకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని కెవిన్ పీటర్సన్ ఆకాంక్షించారు.
బిట్టు తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌదరి. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలోని బియోరా ప్రాంతానికి చెందిన అతడు పర్యావరణ పరిరక్షణపై ఆసక్తితో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అజ్నార్ నదిని శుభ్రం చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడి సేవలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.





