29 Aug 2026, Saturday
జిల్లా వార్తలు

టమోటా.. నష్టాల మూట! ధరలు పతనం.. రైతులకు కన్నీళ్లే మిగిలాయి

By PRAJA NADU Desk 29 Aug 2026, 02:08 PM Updated: 29 Aug 2026, 02:18 PM 1 views
అనంతపురం జిల్లాలో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎకరానికి దాదాపు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టినా, మార్కెట్‌లో 15 కేజీల టమోటా క్రేట్‌ కేవలం రూ.150కే పలుకుతోంది. కూలీలు, రవాణా, మార్కెట్‌ కమిషన్‌ ఖర్చులు కూడా తిరిగి రాకపోవడంతో కొందరు రైతులు పంటను తోటల్లోనే వదిలేస్తుండగా, మరికొందరు రోడ్డు పక్కన పడేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లాలో టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎంతో ఆశతో సాగు చేసిన టమోటా పంట ప్రస్తుతం రైతులకు నష్టాల మూటగా మారింది. టమోటా ధరలు భారీగా పతనం కావడంతో పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. రొద్దం మండలంలోని ఆర్‌.కొట్టాల, రాచూరు, దొడగట్ట, ఆర్‌.మరువపల్లి, వైటిరెడ్డిపల్లి, రాగిమేకలపల్లి, బూచర్ల, బొక్సంపల్లి తదితర గ్రామాల్లో రైతులు టమోటా సాగు చేశారు. ఎకరానికి సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. కట్టెలు నాటి దారం కట్టు పద్ధతిలో సాగు చేయడంతో ఖర్చులు మరింత పెరిగాయి. ఆర్‌.కొట్టాల గ్రామానికి చెందిన రైతు పెద్ద ఎర్రిస్వామి రెండెకరాల్లో టమోటా సాగు చేయగా సుమారు రూ.2 లక్షలు ఖర్చయింది. దిగుబడి ఆశాజనకంగా వచ్చినప్పటికీ ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో కూలీ ఖర్చులు కూడా రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో 15 కేజీల టమోటా క్రేట్‌ ధర కేవలం రూ.150గా ఉంది. పంట కోతకు కూలీలకు చెల్లించాల్సిన డబ్బు, మార్కెట్‌కు తరలించేందుకు వాహన ఖర్చులు, మార్కెట్‌ కమిషన్‌ వంటి అదనపు వ్యయాలు రైతులపై మరింత భారం మోపుతున్నాయి. రోజుకు 200 క్రేట్ల వరకు దిగుబడి వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. ధరలు లేకపోవడంతో కొందరు రైతులు పంటను పూర్తిగా వదిలేస్తున్నారు. ఉరవకొండ సమీపంలో అనంతపురం-బళ్లారి రహదారి పక్కన కూడా రైతులు టమోటాలను పడేసిన పరిస్థితి కనిపించింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related Stories