ఓట్ల తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన.. SIRపై సీఈసీకి లేఖ
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ కోసం చేపడుతున్న SIR ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు లేఖ రాశారు. దాదాపు 92.86 లక్షల ఓట్ల తొలగింపుపై సమగ్ర పరిశీలన అవసరమని కోరారు. క్లెయిమ్స్, అభ్యంతరాలు తెలిపేందుకు ప్రస్తుతం ఉన్న గడువు సరిపోదని పేర్కొంటూ మరో నాలుగు వారాల గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ కోసం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు సీఎం లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగింపునకు గురవుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని ఆయన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
దాదాపు 92.86 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించిన అంశాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాలని సీఎం కోరారు. ఓటర్లు తమ పేర్లు, ఓటు హక్కు వివరాలను పరిశీలించుకోవడంతో పాటు, అవసరమైన పత్రాలను సమర్పించి క్లెయిమ్స్, అభ్యంతరాలు నమోదు చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న గడువు సరిపోదని పేర్కొన్నారు.
ముఖ్యంగా వలస కూలీలు, రోజువారీ కూలీలు తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి అదనపు సమయం అవసరమవుతుందని సీఎం తెలిపారు. అందువల్ల క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని సీఈసీని కోరారు.
అలాగే హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నందున అదనపు సిబ్బందిని నియమించాలని సీఎం సూచించారు. ఈ మూడు ప్రాంతాల్లో అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను (EROs) నియమించాలని కోరారు.
SIR ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా వికేంద్రీకరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైతే అభ్యంతరాలు లేదా క్లెయిమ్స్ దాఖలు చేసుకునేందుకు తగిన అవకాశం కల్పించాలని ఆయన కోరినట్ట్లు సమాచారం.





